Sunday, 1 March 2026

నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా

నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా అను రమణీయమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి చెప్పబడిన ఇరవై నాల్గవ దివ్యనామము. అమ్మవారి పెదవులు అప్పుడే సానబట్టిన క్రొత్త ఎర్రని పగడముల రంగును,బాగా పండిన దొండపండ్ల ఎఱుపు రంగును ధిక్కరించేటంతటి అరుణ వర్ణంలో శోభిల్లుతున్నాయి. అసలు దీని ముందర విషయం తెలుసుకుందాము. మహిషాసురుడుని చంపడం దేవతలకు సాథ్యపడలేదు.అప్పుడు విష్ణువు వాళ్ళందరికీ ఒక మార్గం చెప్పాడు.ప్రతి ఒక్కరూ వారి వారి తేజాన్నీ, శక్తినీ,వారి అంశతో ఒక దేహ భాగాన్ని ఇచ్చి ఒక స్త్రీని సృష్టించాలి.అప్పుడు బ్రహ్మాది దేవతల శరీరముల నుండి అద్భుత తేజస్సు బయటకు వచ్చింది.ఆ తేజస్సు ఒక మహత్తరమయిన స్త్రీ మూర్తిగా రూపు దిద్దుకుంది.ఆమెయే శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి.ఆ తల్లికి వివిథ దేవతల అంశల నుండి అంగ సంపద లభించింది. అమ్మవారికి సూర్యుని యొక్క తేజస్సుతో మిగుల లాలిత్యము,మృదుత్వము,కోమలత్వములతో కూడిన అథరోష్టము ఆవిర్భవించింది.అధరోష్టము అంటే క్రింది పెదవి.పై పెదవి కార్తికేయుని తేజస్సుతో ప్రకటితమయినది.అమ్మవారి క్రింది పెదవి బింబము,అనగా పండిన దొండపండు లాగా ఉంది.ఆ తల్లి పై పెదవి సాన బట్టిన విద్రుమము లాగా ఎర్రగా ఉంది.విద్రుమము అంటే పగడము అని అర్థము.ఇక్కడ ఇంకో చమత్కారము ఉంది.పగడము గట్టిగా ఉంటుంది కదా!మరి అమ్మ పెదవులు మృదువుగా లేత తమలపాకుల లాగా నవ నవలాడు తున్నాయి కదా!దొండపండు రెండు మూడు రోజులలో మాగి,మగ్గి పోతుంది కదా!అందుకనే వ జత శిన్యాది వాగ్దేవతలు అమ్మవారి పెదవులు క్రొత్తగా సానబెట్టిన పగడాలనూ,దొండపండు ఎరుపులనూ ధిక్కరిస్తున్నాయి అని మనకు చెబుతున్నారు. శంకరాచార్యులవారు అయితే అమ్మవారి అందము నిరుపమానమయినది అని నొక్కి వక్కాణిస్తున్నాడు.అమ్మవారి పెదవులు దొండ పండు లాగా ఉంటాయి అని వాటికి బింబము అని పేరు వచ్చిందట.రదన అంటే పెదవులు.చక్కని పలువరసను తెరలాగా కప్పుతున్నాయి ఆ దొండ పండు,పగడపు ఎర్రదనాన్ని ధిక్కరించే ఆ లేలేత కోమలమయిన పెదవులు.

1 comment: