Tuesday, 3 March 2026
కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా
కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా అను అందమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో ఇరవై ఆరవ నామముగా చెప్పబడింది.అమ్మవారు కర్పూరాది సుగంథ చూర్ణ మిశ్రితమయిన తాంబూలాన్ని చర్వణము చేస్తుంటే,ఆ పరిమళములు దిగంతాల వరకూ వ్యాపిస్తున్నాయట!
ఆమె తాంబూలము సేవించిందంటే ఎలా ఉండాలి?లేలేత తమలపాకుకు సున్నం రాసి,కవిరి పొడి లేక కాచు పొడి(నల్ల తుమ్మ చెట్టు బెరడు పొడి),పచ్చి పోక,వక్కపొడి,పచ్చ కర్పూరము,యాలకులు,లవంగాలు,చలువ మిరియాలు,నాగకేసరములు,జాజికాయ,జాపత్రి,కుంకుమ పువ్వు,ఎండు కొబ్బరి,పొదీనా పువ్వు తగు పాళ్ళలో వేసిన మిశ్రమము కలిపి వేసిన తాంబూలము ఘుమ ఘుమ లాడుతూ ఉండాలి.అలాంటి సుగంథ ద్రవ్యాల సమాహారంతో తయారు కాబడిన తాంబూలము నములుతుంటే అమ్మవారి నోటినుంచి సుగంథాలు దశదిశలా వ్యాపిస్తున్నాయి.దిగంతాలవరకూ వెళుతున్నాయి.అమ్మవారి నోరు ఎర్రగా పండింది.అమ్మ తాంబూల చర్వణము చేస్తుంటే దేవతలు అందరూ తాంబూల కబళము కోసము ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.దానినే ప్రసాదంగా స్వీకరించేదానికి ఉబలాటపడుతున్నారట.ఆ పరిమాళానికి ఆకర్షించబడి తుమ్మెదలు మకరందము కోసరము ఝంకారములు చేసుకుంటూ వచ్చి,ఆమె కురులలో ఉండే పుష్ప సంపదపైన వాలాయట.భక్తులు కూడా ఆమె కృపా కటాక్షములకొరకు ఆమెను చుట్టుముట్టుతున్నారు.
శంకరాచార్యులవారు ఆమె తాంబూల చర్వణంపై ఇలా చెప్పారు.ఒకసారి శివుడి ఆన మేర కుమారస్వామి,ఇంద్రుడు,విష్ణువు రాక్షసులపైకి యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చారు.శివుడు కానుకలు ఇవ్వబోతే కాదన్నారు.లోపల తూగుటుయ్యాల పైన చిన్నగా ఊగుతూ తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి దగ్గరకు వచ్చారు.కన్నతల్లి బిడ్డలను చూస్తే అనుకోకుండా నవ్వుతుంది కదా!అలా వారిని చూసి నవ్వింది.అప్పుడు నోటిలో తాంబూలం కబళములు క్రింద పడ్డాయి.వాటిని చూచి వారు ముగ్గురూ ఆబగా తీసుకుని తిన్నారు.అమ్మ ఎంగిలి బిడ్డలకు అమృతతుల్యం కదా!దేవతలకే ఆమె మాతృమూర్తి.అలాంటిది మనమంతా కూడా ఆమె సంతతి కాకుండా పోతామా?ఆమె మనలను కాపాడకుండా చిన్న చూపు చూస్తుందా?ఎప్పటికీ కాదు.ఆమె చల్లని చూపులు మనలను ఎప్పుడూ నిమురుతూ ఉంటాయి.
Subscribe to:
Post Comments (Atom)
🙏
ReplyDelete