Sunday, 29 March 2026

నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయీ

నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయీ అను దివ్యనామము శ్రీలలితా సహస్రనామావళిలోని ముప్పై నాల్గవ నామము.రవి కాంచని చోటు కవి కాన్చును అని అంటారు కదా!ఆ మాటలకు ఉదాహరణ ఈ నామము.అమ్మవారి నాభి ఒక పాదు లాంటిది.నాభి నుంచి ఊర్ధ్వ ముఖంగా పాకిన నూనూగు తీగలాగ ఉందట సన్నని వెంట్రుకల సముదాయము.ఆ నూగారు తీగ కొనలకు పండిన ఫలాలలాగా ఉన్నాయట ఆమె స్తనద్వయం.ఇంత శోభతో అలరారుతున్నది ఆ తల్లి. ఇక్కడ నాభి అనేది మణిపూర చక్రము.అయితే స్తన మధ్య భాగము అనాహత చక్రము అవుతుంది.అప్పుడు ఇడా,పింగళ నాడులను ఆ తల్లి స్తనములుగా భావించాలి.అప్పుడు బొఢ్డు నుండి వక్ష స్థలము వరకు ఊర్థ్వ ముఖంలో ఉండే సన్నని రోమాళిని సుషుమ్నా నాడిగా భావించాలి.వశిన్యాది దేవతల వర్ణనలో ఎంత అర్థమూ,పరమార్థమూ ఉన్నాయి కదా! ఇంతేనా!నాభిని పాదుతో పోల్చడం ఆలవాలత్వము.ఒక విత్తు మొలక కావాలంటే కావాలసిన నీరు,సత్తువను ఇవ్వగల పాదు ఆలవాలత్వము అంటే.రోమాళియందు లతాత్వము సమన్వయింపబడింది.కుచముల యందు ఫలత్వము అన్వయింపబడింది.ఎంత హృద్యంగా,రమణీయంగా ఉంది కదా పోలిక.బిడ్డ పుట్టగానే బొడ్డు కోస్తారు.దానితో తల్లీ బిడ్జ భౌతికంగా వేరవుతారు తప్ప మానసికంగా,ప్రేమపరంగా కాదు. ఇంకో విశేషము.శివుడు కోపంతో మన్మథుడిని భస్మం చేసాడు కదా!అప్పుడు ఆయన తాపం తగ్గించుకునేదానికి అమ్మవారి నాభి అనే సరస్సులోకి దూకాడట! శంకరాచార్యులవారు అమ్మను కీర్తించడంలో అసలు అలసిపోరు.తల్లి నాభి నిశ్చలమయిన గంగా ప్రవాహం లాంటిది అట.నీ నాభి స్తనములు అనే పూల మొగ్గలకు ఆథారమయిన రోమరాజి అనే తీగెకు పాదులాంటిది.అది మన్మథుని పరాక్రమాగ్నికి హోమగుండము.రతీదేవికి విహారగృహము.ఈశ్వరుని కనుల సిద్థికి గుహాముఖము అయి విరాజిల్లుతున్నది. అమ్మవారిని ఇంత బాగా వర్ణించడం వారికే చెల్లు.

No comments:

Post a Comment