Friday, 30 January 2026

రాగస్వరూప పాశాఢ్యా

రాగస్వరూప పాశాఢ్యా అనేది శ్రీలలితా సహస్ర నామావళి లోని ఎనిమిదవ నామము. రాగము అంటే అనురాగము అని అర్థము.స్వరూప అంటే స్వరూపము కలది అని.పాశాము అంటే బంధము లేక ఉచ్చు అని అర్థము. ఆ తల్లికి నాలుగు బాహువులు ఉన్నాయి అని చెప్పుకున్నాము కదా!ఆమెకు ఎడమ వైపు గల క్రింది చేతిలో పాశము ధరించి ఉంటుంది.అది అనురాగమనే పాశము. ఆ పాశముతో ఆమె తన భక్తులు తప్పు మార్గంలో పోకుండా కాపాడుకుంటుంది.కామ,క్రోధ,మద,లోభాలకు ఉచ్చు బిగిస్తుంది.మానవుడు సరైన మార్గంలో పయనించేదానికి,ఆ అనురాగ స్వరూప పాశం ఉపయోగిస్తుంది. మంచికి చెడ్డకు,ప్రేమకు మోహానికి మనంగీత గీసుకోవాలి.లేకపోతే దారి తప్పిపోవడం చాలా సులువు.క్షణం పట్టదు మనసు నిగ్రహించుకోలేక పోతే! అనురాగము అనేది వాసనాత్మకము.పాశం అనేది స్థూల రూపం.ఒకరకంగా బంధం అంటే ప్రతిబంథకమే!అది విడిపించుకుంటేగానీ మోక్షం దక్కదు.

Tuesday, 27 January 2026

చతుర్బాహు సమన్వితా

చతుర్బాహు సమన్వితా అనే నామము శ్రీలలితా సహస్రనామావళిలోని ఏడవ నామము.చతుర్బాహు సమన్వితా అంటే నాలుగు బాహువులు కలది అను అర్థము.ఊర్ధ్వబాహువులు ధర్మ,మోక్షములు,క్రింది బాహువులు అర్థ కామములు. ఆ పరమేశ్వరి చేతులు ఋగ్వేదము,యజుర్ వేదము,సామ వేదము మరియు అధర్వణ వేదములు.చతుర్వర్ణములు కూడా ఆ తల్లినుండే ఆవిర్భవించాయి. చతురాశ్రమములు అనగా బ్రహ్మచర్యం,గృహస్థము,వానప్రస్థము మరియు సన్యాసము కూడా అమ్మవారి నాలుగు బాహువులు అనుకోవచ్చు.వీటిని మనము నిష్టగా పాటిస్తే చాలు.

Monday, 26 January 2026

ఉద్యద్భాను సహస్రాభా

ఉద్యద్భాను సహస్రాభా అనునది శ్రీలలితా సహస్రనామావళిలోని ఆరవ నామము.మనము సూర్య చంద్రులు మనకు వెలుగునిస్తున్నాయి అనుకుంటాము.కానీ నిజానికి ఆ తల్లి తేజముతోటే అవి వెలుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారు ఉదయించుచున్న భానుని యొక్క సహస్ర కిరణముల సమానమైన కాంతులతో విరాజిల్లుతున్నది అని అర్థము.ఇక్కడ సహస్రము అంటే లెక్కగా వెయ్యి అని కాదు.లెక్కలేనన్ని అని,అనంతము అని అర్థము. తల్లి త్రికోణరూపిణి,శివుడు బిందురూపము.అమ్మ వ్యక్తము,అయ్య అవ్యక్తము. దేవీ భాగవతములోని కథ.తారకాసురుడు అనే రాక్షసుని బాధలు పడలేక దేవతలు పరమేశ్వరిని ప్రార్థిస్తారు.చైత్ర శుద్థ నవమి నాడు కాంతి పుంజములాగ,కోటి సూర్య ప్రభలతో,మెరుపుతీగలాగా సాక్షాత్కారము అవుతుంది.దేవతలు అంత కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్నారు.అప్పుడు అపురూప లావణ్యంతో కనిపిస్తుంది.అప్పుడు వారందరూ ఉద్యద్భాను సహస్రాభా అని కీర్తిస్తారు.

Sunday, 25 January 2026

దేవకార్య సముద్యత

దేవకార్య సముద్యత అనేది శ్రీ లలితా సహస్ర నామావళిలోని ఐదవ నామము.శ్రీమాత దేవతల యొక్క కార్యములకొరకు ఆవిర్భవించినది.అందుకే ఆమెకు దేవకార్య సముద్యత అనే నామము సార్థకము అయినది. శ్రీమాత భండాసుర,మహిషాసురులను అంతమొందించే దానికి ఆవిర్భవించింది.రాక్షస సంహారముతో పాటూ సృష్టి,స్థితి,లయ కార్యముల వంటి దేవ కార్యముల నిర్వహణలో ఇంద్రాది దేవతలకు సహాయపడేదానికి జనించింది.ధర్మ పరిరక్షణకోసము పుట్టినది. నిజానికి ఆ తల్లి నిర్గుణ.కానీ రాక్షస సంహారం కోసరము సగుణరూపము ఆపాదించుకుంది. ఒకప్పుడు శివుని కోపాగ్నికి మన్మథుడు కాలి భస్మం అయిపోతాడు.గణేశ్వరుడు అనే శిల్పి ఆ భస్మంతో విచిత్ర ఆకృతి గల మానవుడుని తయారు చేసాడు.ఆ విచిత్ర పురుషుడే భండుడు అనే రాక్షసుడు.వాడు మానవులతోనే కాక,ఇంద్రాది దేవతలను,త్రిమూర్తులతోను కూడా యుద్ధానికి తలపడసాగాడు.ఎవరూ అతనిని జయించలేక పోయారు.అప్పుడు దేవతలు అందరూ ఆ తల్లిని రక్షించమని అడిగేదానికి లక్ష యోజనాల విస్తీర్ణము కల యజ్ఞకుండాన్ని నిర్మించి హోమం చేస్తారు.ఆహుతి చాలక దేవతలు వారి వారి శరీర భాగాలు కుండంలో వేసేదానికి సిద్ధ పడతారు.అప్పుడు ఆ యజ్ఞ కుండంలో నుంచి ఆవిర్భవించి రాక్షస సంహారము చేస్తుంది. మనలో ఉండే కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలే మనలను ఆవహించిన అసురులు.వాటిని ప్రారదోలేదానికి,అజ్ఞానాంధకారాన్ని మటుమాయం చేసేదానికి మనకు చేయూత నిచ్చేది జ్ఞాన ప్రదాయిని శ్రీమాత.

Thursday, 22 January 2026

చిదగ్నికుండ సంభూత

లలితా సహస్రనామావళిలోని నాలుగవ నామము చిదగ్నికుండ సంభూత. చిత్ అంటే చైతన్యము.చైతన్యము అనే అగ్నికుండము నుంచి ఉద్భవించినది గావున మాతకు చిదగ్నికుండ సంభూత అనే సార్థక నామము పెట్టబడింది. చిత్ అంటే జ్ఞానము అనికూడా అర్థము.అంటే జ్ఞానమనే అగ్నికుండములోనుంచి పుట్టినది. అగ్ని కల్మషాన్ని భస్మం చేస్తుంది.అజ్ఞానము అనే అంధకారాన్ని ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది.శుద్ధబ్రహ్మము చేరుకోవాలంటే ఆ చిదగ్నికుండ సంభూత ఆశీర్వాదము మనకు కావాలి.ఆ చల్లని చూపులు మనపై ప్రసరించాలి అంటే ఆతల్లిని మనసా వాచా కొలవాలి.

Tuesday, 6 January 2026

శ్రీమత్సింహాసనేశ్వరి

శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామము శ్రీ లలితా సహస్ర నామావళి లోని మూడవ నామము. సింహం అడవికి రాజు.ఆ సింహాన్నే తన బంటుగా చేసుకుంది ఆ పరమేశ్వరి.దానిని అథిరోహించింది.దానినే తన ఆసనం చేసుకుంది.అందుకే శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామము సార్థకమయినది. శోభాయమానమయిన సింహముఖ మేర్పరచిన స్వర్ణ పీఠమును అధిష్టించిన ఈశ్వరి కావున శ్రీమత్ సింహాసనేశ్వరి అయినది. సింహము మనలోని పాశవికత,హింసాత్మక లక్షణానికి ప్రతీక.అలాంటిది ఆ దుష్ట,క్రూర సింహాన్ని అదుపులోకి తెచ్చుకుంటేనే కదా దానిని ఎక్కగలిగేది.శ్రీ లలితా పరమేశ్వరి సింహాన్ని ఎక్కి మహిషాసుర మర్దనకు బయలుదేరి ఆ అసురుడి అంతం చూసింది.అప్పటి నుంచీ ఆమెను సింహాసనేశ్వరి అని పిలుస్తున్నారు. ఆమె అధిష్టించిన పీఠానికి అయిదు కోళ్ళు ఉంటాయి.పంచ బ్రహ్మలు అనగా బ్రహ్మ,విష్ణువు,రుద్రుడు,మహేశ్వరుడు,సదాశివుడు ఆమెను అతి దగ్గరగా ఉండి సేవించుకోవాలనుకున్నారు.వారు ఒక ఆసనము ఏర్పరచి దాని నాలుగుకోళ్ళు అయినారు.సదాశివుడు అయిదవ కోడు,పరుపులాగ అయ్యాడు.

Monday, 5 January 2026

శ్రీ మహారాజ్ఞి

శ్రీమహారాజ్ఞి అనే నామము లలితా సహస్రనామావళిలో రెండవ నామము. అఖిల లోకాలకూ అధినేత్రి,సామ్రాజ్ఞి కాబట్టి మహారాజ్ఞి అనే పేరు వచ్చింది.సమస్త బ్రహ్మాండాన్ని తన పరిపాలనా దక్షతతో అన్ని వేళలా కాపాడుతుంది కాబట్టి ఆ పేరు సార్థకమయింది.ఆమె గ్రహగతులు తప్పకుండా నవగ్రహాలనూ,ఋతుధర్మాలు తప్పకుండా అష్టదిక్పాలకులనూ నియంత్రిస్తూ ఉంటుంది.సర్వం ఆమె పర్యవేక్షణలో సాగుతుంటుంది.

Thursday, 1 January 2026

శ్రీమాత ……

లలితాదేవి సహస్ర నామాలు శ్రీమాతా అని ప్రారంభమవుతాయి.మాత అంటే అమ్మ.దేవుడు కంటే ఉచ్ఛ స్థానం అమ్మది.మన సృష్టికి మూలకారణం అమ్మ. శ్రీ అంటే మంగళప్రదము,శుభప్రదము.లలితాదేవి శుభములను ఇచ్చే తల్లి.శ్రీ అంటే శారద,రమ,ఈశ్వరిల సమ్మేళనము.ఈ ముగ్గురికీ అమ్మ ఆ పరమేశ్వరి.శారద అంటే సరస్వతి,రమ అంటే లక్ష్మి,ఈశ్వరి అంటే పార్వతి.వీరు ఇచ్ఛాశక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తి స్వరూపిణులు.అంటే వీరి తల్లి సంపూర్ణ శక్తి స్వరూపిణి అని అర్థము.