Wednesday, 4 March 2026

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి అను మృదు మథురమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి ఇవ్వబడిన ఇరవై ఏడవ నామము. సంగీత సాహిత్యములకు అధినేత్రి సరస్వతీ దేవి.ఆమె వీణ పేరు కచ్ఛపి.అటువంటి వీణా మాథుర్యమును కూడా ధిక్కరించ గలిగేలా అమ్మ సంభాషణ ఉంది.ఈమె మాటల సొబగు,సౌందర్యము,మధురము అద్వితీయము.ఇక దేనితోనూ పోల్చలేము.కచ్ఛపీ వీణలో ఏడు తంత్రులు ఉంటాయి.ఈ వీణకు ఇరవై నాలుగు మెట్లు ఉంటాయి.దాని వలన స్వర స్థానములు ఎక్కువ పలికి స్పష్టత చాలా బాగుంటుంది. వశినీ,కామేశ్వరీ,మోదిని,విమల,అరుణ,జయిని,సర్వేశ్వరి,కౌళిని...।వీరిని వశిన్యాది వాగ్దేవతలు అని అంటారు. శంకరాచార్యులవారు ఇంకా బాగా వర్ణించారు అమ్మ పలుకు ని.ఒకసారి సరస్వతీ దేవి దేవతల కొలువులో శివుడిని స్తుతిస్తూ గానం,వీణానాదం చేస్తూ ఉందట.అమ్మవారు తన్మయత్వంతో తల ఆడించిందట.అది సరస్వతి గమనించింది.మామూలుగా పాడితేనే ఇలా ఊగి పోతున్నారు.నిజంగా నా తడాకా చూపించి అత్యద్భుతంగా పాడాలి అని తీర్మానించుకుని పాడడం మొదలు పెట్టింది.అది విని అమ్మవారు సాధు సాధు అని అనింది.అంటే బాగుంది ,బాగుంది అని అర్థము.ఆ రెండు పలుకులు ఎంత తీయగా,ఎంత శ్రావ్యంగా,ఎంత మధురిమలు ఒలికాయంటే ఈమె పలుకుల ముందు సరస్వతీ దేవి పాట తేలిపోయింది.ఆమె మౌనంగా తన వీణను కొంగు చాటున దాచుకుందట.అమ్మ పలుకులు అంత తేనెలూరుతున్నాయి.

1 comment: