Wednesday, 25 March 2026

రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్వితా

రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్వితా అను మనోహర నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన శుభనామము.రత్నహారములు,ప్రకాశవంతంగా మెరిసే మంచి ముత్యాల సరములు,కాంతులీనే చింతాకు పతకముల వంటి కంఠాభరణములతో ఆ తల్లి ఒప్పారుతున్నది. వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ఇలా వర్ణించారు.అమ్మ తన మెడలో వేసుకున్న మంచి ముత్యాల హారము మెడ నుండి గుండెలదాకా రత్నాల పేటల హారములకు క్రింద వేలాడే లోలాకులతో కూడి ఉన్న ముత్యాలతో కూడిన చింతాకు పతకం వ్రేలాడుతున్నది. శంకరాచార్యులవారు ఈ విషయం అస్సలు ఒప్పుకోవటం లేదు.ఆయనకు స్త్రీల సౌందర్యాభరణాల పైన ఎక్కువ పట్టు ఉన్నట్లుంది.ఆయన ఇలా అంటున్నాడు.ఎక్కడైనా స్త్రీలు ముత్యాల పతకం ఉన్నప్పుడు ముత్యాల సరాలు ఉంటాయి కానీ ఎక్కడైనా రత్నాల పేటలు ఉంటాయా?ఊహూ!ఉండనే ఉండవు.ఆమె వేసుకుంది ముత్యాల పేటల హారాలే!కానీ ఎందుకు అవి ఎర్రగా మెరుస్తున్నాయో శంకరాచార్యుల వారు కనిపెట్టేసారు.ఆ తల్లి పెదాలు తాంబూల చర్వణానంతరం ఎర్రగా కాంతులీనుతున్నాయి కదా!ఆ ఎర్రని జిలుగులు అమ్మవారు ధరించిన ముత్యాల సరాల పైన బడి ఎర్రగా మెరిసిపోతున్నాయట! ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది.అమ్మవారు ధరించిన మేలి ముత్యాలు గజకుంభం నుంచి పుట్టినవి.మామూలుగా ముత్యాలు ముత్యపు చిప్పలలోనే కాకుండా ఇంకా అయిదు చోట్ల లభిస్తాయి.అవి గజకుంభేషు,వంశేషు,ఫణేషు,జలదేమచ,శుక్తికాయా,మిక్షుదండే,షోడా మౌక్తిక సంభవా. అంటే ఏనుగు కుంభ స్థలము నందు వివిధ వర్ణాల ముత్యాలు దొరుకుతాయి.వెదురు బొంగులో తెలుపుతో కూడిన ఎఱుపు రంగు (పాటల వర్ణము)ముత్యాలు,సర్పముల పడగల యందు నీల వర్ణములు,మేఘముల యందు మెరుపు వర్ణము కలవి,ముత్యపు చిప్పల యందు శ్వేత వర్ణము కలవి,చెరకు గడల యందు పసుపు వర్ణము కలవి సంభవిస్తాయి. అమ్మ గుండెల పైన వ్రేలాడేది చింతాకు పతకం కాదట అసలు!భగవంతుని గూర్చి చింత కలిగిన వారు చింతాకులు అంట.వారిలో మూడు రకాలు ఉన్నారు.గ్రైవేయ చింతాకులు తమ కంఠంతో అమ్మను ధ్యానిస్తారు.లోల చింతాకులు కోరికతో అమ్మను కొలుస్తారు.ముక్త చింతాకులు ముక్తి కోరుకుంటూ అమ్మను కొలుస్తారు.ఆమె ధరించే చింతాకు పతకం ఈ భక్తులకు ప్రతీక అట!అంటే ఏ రకంగా కొలిచినా భక్తులను అమ్మవారు తన గుండెల్లో పెట్టుకుని కాపాడు కుంటుంది అని అర్థము.

No comments:

Post a Comment