Monday, 2 March 2026

శుద్థ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా

శుద్దవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా అను పవిత్ర నామము శ్రీ లలితా సహస్ర నామావళిలోని ఇరవై అయిదవ నామము.ఈ నామానికి చాలా అర్థమూ,పరమార్థమూ ఉంది. శ్రీవిద్య అనగా శుద్ధ విద్య యందు పదహారు వర్ణ రూపాలు,అదే బీజాక్షరములు ఉన్నాయి.ఆ తల్లి పలువరస ఆ బీజాక్షరాల జంట పంక్తులు లాగా మెరసి పోతున్నాయి.శుద్ధ విద్య అనగా జ్ఞాన విద్య.అమ్మవారు శుద్ధ విద్యాంకుర స్వరూపులగు బ్రాహ్మణులు,అదే ద్విజులు,అను పలువరసలతో ప్రకాశిస్తున్నదని వశిన్యాది వాగ్దేవతలు వర్ణిస్తున్నారు.షోడశకళా ప్రపూర్ణురాలు కాబట్టి షోడశి అను నామము సార్థకమయినది.షోడసీ మంత్రమునకు పదహారు బీజాక్షరములు ఉన్నాయి.అవి క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం శ్రీం.వీటిని వశిన్యది వాగ్దేవతలు శుద్థ విద్యాంకురములు అని అన్నారు.అ నుండి అః వరకు ఉండే అచ్చులు శక్తి స్వరూపాలు.క నుండి క్ష వరకు ఉండే హల్లులు శివ స్వరూపాలు.అచ్చులూ హల్లులూ కలిస్తేనే అక్షర,పద నిర్మాణం అవుతుంది.ఇవి అన్నీ కలసి ముప్పై రెండు అవుతాయి.అదే ఆమె పలువరస. మంత్రము ఉచ్ఛారణ శబ్దము అవుతుంది.ఆ శబ్దము,ఆ వాక్కుకు స్పష్టత చేకూరేదానికి నాలుగు వాక్స్వరూపములు ఉన్నాయి.అవి పరా,పశ్యంతి,మధ్యమ మరియు వైఖరి. మనము ఒక కార్యము చెయ్యాలి అనుకుంటే ఆ తలపు వచ్చేదానికి ముందు స్థితి పరా అంటారు.ఆ తలపును పశ్యంతీ వాక్కు అని అంటారు.ఆలోచన కార్య రూపము థరించే ముందు ఉండే ఊహా స్థితిని మథ్యమ వాక్కు అని అంటారు.తలపు కార్య రూపం ధరించడం వైఖరీ వాక్కు అని అంటారు.బ్రహ్మ రంథ్రంలో పుట్టి మూలాథారంలో గాలి బుడగగా మారి,విశుద్థి చక్రంలోని అచ్చులతో చేరి,వాక్కుకు స్పష్టత ఏర్పడి శబ్దంగా బయటకు వస్తుంది. బ్రాహ్మణుడికి ఉపనయనం ముందర ఒక జన్మ,ఉపనయనం అయిన తరువాత ఇంకో జన్మగా పాటిస్తారు.కాబట్టి అతనికి ద్విజుడు అనే నామము సార్థకమయినది.అతను తను సంపాదించిన జ్ఞానాన్ని శిష్య పరంపరకు ఉపదేశిస్తాడు,థారపోస్తాడు.కాబట్టి ద్విజులు విద్యాంకుర స్వరూపులు అని వాడుకలో ఉంది.ఆమె పలువరసే బీజాక్షరాలమయం కాబట్టి ఆ తల్లి జ్ఞాన స్వరూపిణి అయింది.

No comments:

Post a Comment