Friday, 27 February 2026

పద్మరాగ శిలాదర్శపరిభావి కపోలభూః

పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః అను అత్యంత రమణీయమయిన నామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మకు పెట్టబడిన ఇరవై మూడవ నామము. అమ్మ మృదు మోము రాగరంజితము.ఆమె చెక్కిళ్ళు పద్మరాగమణులతో తయారు చేయబడ్డ అద్దాన్ని కూడా త్రోసి రాజంటున్నాయట.అంటే అంత నున్నగా,లేలేతగా నిర్మలంగా కెంపు రంగుతో మిరుమిట్లుగొలుపుతున్నాయి. పద్మరాగమణులు పండు దానిమ్మగింజలంత ఎర్రగా ఉంటాయి.ఎరుపు రంగు ప్రేమకు,అనురాగానికి చిహ్నము.పద్మరాగమణులకు సహజ సిద్థంగానే కాంతులు ఎక్కువ.అంతకంటే అంటే ఇంకెంత కాంతిమంతంగా ఉందో కదా ఆ తల్లి ముఖారవిందము.వీటన్నిటికీ తోడు అమ్మ నిత్య యౌవన సంపన్నురాలు.ఇంక ఆమె మృదు మథుర సోయగం గురించి వశిన్యాది వాగ్దేవతలు ఎంత వర్ణించినా తక్కువే సుమా! ఆది శంకరాచర్యులు ఆ తల్లిని వర్ణించడంలో ఇంకో నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.ఆ తల్లి కపోలములు ఎంత నున్నగా,మృదువుగా,నిర్మలంగా,అద్దంలాగా మెరిసి పోతున్నాయంటే ఆమె చెవి తాటంకములు ఆమె బుగ్గల పైన ప్రతిబింబిస్తున్నాయట!ఎంత హృద్యమయిన వర్ణన కదా!అంతేనా?కాదు కాదు.ఆమె ముఖము తాటంకములు,వాటిబింబాలతో కలసి నాలుగు చక్రాలతో కూడుకున్న మన్మథుని రథంలాగా కానవస్తుందట.మన్మథుడు ఆతల్లి ముఖారవిందాన్ని ఆశ్రయిస్తే శంకరుడు ఎక్కడ తప్పించుకుంటాడు అమ్మ వలపులనుండి,సరాగాల నుంచీ?మన్మథుడు ఎంత తెలివి కలవాడు కదా!శంకరుడు మన్మథుడిని ఆకారం లేకుండా బూడిద చేసాడు.ఈయనేమో అమ్మ ముఖారవిందం ఆసరాగా చెరుకుగడ వింటితో శరసంథానం చేస్తున్నాడు.అమ్మ కనుబొమలు మన్మథుడి వింటిని ప్రతిబింబిస్తున్నాయి కదా!

1 comment: