Friday, 13 February 2026

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా అను నామము శ్రీలలితాసహస్ర నామావళి లోని పదమూడవ నామము. అంటే చంపక,అశోక,పున్నాగ,సౌగంధిక పుష్పాలతో అమ్మవారి శిరోజాలు అలంకరించబడినాయి.ఆ రకంగా ఆ తల్లి శోభాయమానంగా విరాజిల్లుతున్నది అని అర్థము. పరమేశ్వరి వర్ణన శిరోజాలతో మొదలు అయి పాదాంతముతో పూర్తవుతుంది.అమ్మవారి సూక్ష్మ శరీరము పంచదశీ మంత్రము.పంచదశీ మంత్రమునకు వాగ్భవ,కామరాజ,శక్తి అనే మూడు కూటములు కలవు.అందులో శిరస్సు వాగ్భవ కూటముగా చెప్పబడినది. పరమేశ్వరి ఆవిర్భావము సకల దేవతల శక్తులతో జరిగినది.అందులో ఆమె కేశములు యముని తేజము నుండి సంభవించాయి.కాబట్టే ఆమె కురులు వంకీలుగా,సహజ పరిమళంతో చాలా పొడవుగా ఉన్నాయి.అంతేనా?చిక్కగా,నునుపుగా,సుమనోహరంగా మేఘ వర్ణంతో కళకళలాడుతున్నాయి.ఇక్కడ చమత్కారం ఏందంటే ఆమె తలలో తురుముకున్న పూలవలన ఆమె శిరోజాలకు సువాసనలు అద్దబడలేదు.ఆమె కురులు సహజసిద్థంగా సహజపరిమళంతో సువాసనలు వెదజల్లుతున్నాయి.ఆ సువాసనలు ఆమె తలలో తురుముకున్న పూలకు అంటుకుంది.ఆమె కురులు పూలకంటే అతి మృదువుగా ఉంటాయట!ఈ విషయం వశిన్యాది వాగ్దేవతలే చెప్పారట.ప్రశ్నించేదానికి మనము ఎవరము? ఆ శిరోజాల ఝరిలో ఇరుక్కుని తాము కూడా సుగంధభరితము కావాలని అన్ని రకాల పుష్పాలు ఉవ్విళ్ళూరుతున్నాయట! అప్పుడే వికసించిన నల్లకలువలు లాగా,నల్లటి మేఘాలలాగా ఉండే ఆమె కొప్పు అజ్ఞానము అనే చీకట్లను పారద్రోలుతుందట!ఆఖరుకి ఇంద్రుడి ఉద్యానవనంలోని కల్పవృక్షం పుష్పాలు కూడా ఎప్పుడు మేముంతా ఆమె శిరోజాలలో తురుమబడతాము అని ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటాయట!అమ్మవారు ప్రముఖంగా ఎఱుపు,ఆకుపచ్చ,నీలం రంగు పుష్పాలను ధరిస్తుందట!ఆ రూపం ఎంత జగన్మోహనంగా ఉంటుంది కదా!

No comments:

Post a Comment