Thursday, 26 February 2026
తాటంక యుగళీభూత తపనోడుప మండలా
తాటంక యుగళీభూత తపనోడుప మండలా అను అందమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని ఇరవై రెండవ అమ్మవారి నామము.
అంటే అమ్మవారు తన చెవి తమ్మెలకు సూర్య చంద్ర మండలాలను తగిలించుకుని దేదీప్యమానంగా వెలిగి పోతూ ఉంది.నవగ్రహాలలో సూర్యుడు,చంద్రుడిని మించిన వాళ్ళు లేరు.అలాంటి సూర్య చంద్ర మండలాలను తన చెవి కమ్మలుగా ధరించినది అంటే ఆమె అసమాన్యమయినది అని కదా అర్థము.అలాంటి అమ్మవారిని ఆశ్రయించి ఉన్నామంటే మనకు ఎలాంటి గ్రహ పరమైన అవాంతరాలు,ఆటంకాలు మన దరికి రావు.ఆమె ధరించిన తాటంకములే అనంతాలు అయినపుడు,ఆమె ఇంక ఎంత మహిమాన్వితురాలు అయి ఉండాలి?అది మనం ఊహించలేనిది.
మనము ప్రయత్న పూర్వకంగా మంత్రము చెప్పడం జపము అని అంటారు.అదే అప్రయత్నంగా అదే ప్రక్రియ జరిగితే?దానిని అజపా అని అంటారు.ఇది సహజమయిన ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలచే జరుపబడే హంస స్సోహం అనే అప్రయత్న జపము.దీనినే అజపా గాయత్రీ,హంస గాయత్రీ అని కూడా అంటారు.గాయంతం త్రాయతే అంటే జపము చేయివానిని రక్షించునది అని అర్థము.హంస అను శబ్దము ప్రాణ శక్తికి సంకేతము.కాబట్టి మానవులలో సహజంగా,ప్రకృతి సిద్ధంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలను ప్రాణ గాయత్రీ అని అంటారు.శబ్ద గ్రాహ్యమునకు సంబంథించిన అమ్మవారి చెవులకు ఆభరణాలుగా సూర్య చంద్ర మండలాలను చెప్పడం వశిన్యాది వాగ్దేవతల చతురతకు తార్కాణం!
శంకరాచార్యులవారు అయితే ఆమె కణతల దగ్గర చెవులు వంపు తిరిగి ఉండడం మన్మథుని ధనుస్సును గుర్తుకు తెస్తున్నాయి అని చమత్కరిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment