Sunday, 15 February 2026

కురువింద మణి శ్రేణీ కనత్కోటీర మండితా

కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితా అను నామము శ్రీ లలితా సహస్ర నామావళిలోని అమ్మవారి పదునాలుగవ నామము. అమ్మవారు కురువిందమణులతో పొదిగియున్న కిరీటము ధరించి దేదీప్యమానంగా వెలిగిపోతున్నది అని అర్థము.కురువిందమణులను పద్మరాగ మణులు అనికూడా అంటారు.ఇవి కామము,అనురాగము మొదలైన నానా గుణములు కలిగి ఉంటాయి.ఇవి ఎర్రగా కెంపు వర్ణంలో ఉంటాయి. రావణగంగ అనే ఒక నదిలో లభ్యమవుతాయి.ఇవి ఉత్తమమయిన మణులు.రావణగంగ నదిలో కురువిందములు,సౌగంథికములు,స్ఫటికములు అని మూడు రకాల శిలలు పుట్టాయి.వాటన్నిటిలోకి పద్మరాగములు మేలైనవి.ఈ మణులు బంథూకము అనగా మంకెన పువ్వు,ఇంద్రగోపము అనగా ఆరుద్ర పురుగు,మందారము,దాసాని,రక్తవర్ణము,దానిమ్మ గింజ...ఈ రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి.కొన్ని మోదుగ పువ్వు రంగులో కూడా ప్రత్యక్షమవుతుంటాయి. ఇలాంటి పద్మరాగమణులు వరసగా పొదిగియున్న,బంగారంలా మెరిసిపోతూ,ప్రకాశించుచున్న కిరీటముతో అలంకరింపబడి తేజోమయంగా విరాజిల్లుతున్నది ఆ పరమేశ్వరి అని అర్థము. శంకరాచార్యుల వారు కూడా దీని వర్ణన బహు భేషుగ్గా చేసారు.ఆ తల్లి కిరీటం వరుసగా పొదగ బడిన మణులతో ద్వాదశాదిత్యులకు ఆశ్రయమిచ్చిన గూడులా కనిపిస్తుంది అట!అక్కడ ఉండే చంద్రవంక ఆ మణులకాంతి పైన బడటంతో చంద్ర శకలంలా కాకుండా అద్భుతమయిన,మనోరంజితమయిన ఇంద్ర ధనుస్సులాగా మెరసిపోతున్నది అంట!నీలాకాశంలో ఒకేసారి ఇంద్రధనుస్సుతో కూడిన పన్నెండు మంది సూర్యులు ఉదయించినట్లుగా,అత్యద్భుతము ఆవిష్కరింపబడినట్లుగా కానవస్తుంది అంట! ధాత,అర్యమ్న,మిత్ర,వరుణ,ఇంద్ర,వివస్వంత,త్వష్ట,విష్ణు,అంశుమంత,భగ,పూష మరియు క్రతులను ద్వాదశాదిత్యులు అంటారు.అంతమంది వలన వెలువడే వేడిమి,తాపమును తట్టుకోగలిగే శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది.ఎందుకంటే ఆ వేడి,ఆ చంద్రునిలోని శీతల జ్యోత్స్న ప్రకాశము ఇచ్చింది ఆ పరాశక్తే కాబట్టి.

No comments:

Post a Comment