Monday, 27 July 2026

కిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృతా

కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతా అను దివ్యనామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బైవ నామముగా పేర్కొనబడినది.అమ్మవారికి పదహారు మంది మంత్రిణులు ఉన్నారు కదా!అందులో దండనాథ అను దేవి ఉంది.ఆమెకు ఇంకొక నామము వారాహి దేవి.ఆమె రథము కిరిచక్రము.కిరిచక్రము అధిరోహించిన దండనాథ దేవిచేత సేవింపబడుతున్నది మన తల్లి.అందుకనే ఈపేరు పెట్టబడినది.కిరి అంటే వరాహము.కిరి చక్రరథమును అధిరోహించింది కాబట్టి ఆమెకు వారాహి అనే నామము కూడా ఉంది.కిరి చక్ర రథము వరాహ రూపములో ఉంటుంది.అంతే కాకుండా వరాహములచే లాగబడుతుంది.ఆమె చేతిలో దండము ఉంటుంది.కాబట్టి దండనాథ అను నామము సార్థకము అయినది.పురస్కృతా అంటే సేవింపబడడం,పూజింప బడడం అని అర్థం. కిరి చక్రమునకు ఐదు పర్వములు ఉంటాయి.పర్వములు అంటే ఆవరణలు లేక అంతస్తులు.ఈ అంతస్తులలో వివిధ దేవతలు ఆయుధాలు ధరించి ఉంటారు.ఐదవ ఆవరణములో నల్లగా,వరాహమునకు ఉన్న కోరలు కలిగిన దండినీ ఉంటుంది.ఆమే వారాహీ దేవత.కిరి చక్ర రథ సేనకు పన్నెండు మంది సేనానులు ఉన్నారు.వారు..।పంచమి,దండనాథ,సంకేతా,సమయేశ్వరీ,సమయ సంకేతా,వారాహీ,పోత్రిణీ,శివా,వార్తాళీ,మహా సేనానీ,ఆజ్ఞా చక్రేశ్వరీ మరియు అలిందినీ. ఈ వారాహీ దేవతే అమ్మ వారికి ప్రధాన సేనాని.వారాహీ దేవతకు ఉపాసన కూడా ఉంది.కాశీ క్షేత్రంలో వారాహీ మందిరం కూడా ఉంది.ఈమె బీజాక్షరము హూం!అంటే పోట్లాడే స్వభావము కలది.

No comments:

Post a Comment