Tuesday, 21 April 2026
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా అను శుభప్రదమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన నలభై నాల్గవ నామము.
తిమిరము అంటే చీకటి,అజ్ఞానము అని కదా అర్ధము.చీకటిని పారద్రోలాలంటే వెలుతురు కావాలి కదా!అమ్మవారి కాలి గోళ్ళు తన దగ్గరకు నమస్కరించేదానికి వచ్చే భక్తుల అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేలాగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.అందులోనూ ఆ గోళ్ళు,అదే నఖములు,దేవతల తలపైన ఉన్న మకుటాలలో ఉండే వజ్ర వైఢూర్యాల రాపిడితో సానబెట్టబడి ఉన్నాయి కదా!ఎందుకంటే ముక్కోటి దేవతలూ అను నిత్యమూ ఆమెకు పాదాభివందనం చేస్తుంటారు కదా!
అమ్మవారి పాదాలు షట్చక్రాలకు పైన ఉండి,చక్రాలపైన అనంతమయిన కిరణాలను వర్షింపచేస్తాయి.అలా వర్షించే కిరణాలలో అగ్నికి సంబంధించినవి 108 ఉన్నాయి.సూర్యుడికి సంబంధించినవి 116 కిరణాలు ఉన్నాయి.అలాగే చంద్ర సంబంధిత కిరణాలు కూడా 136 ఉన్నాయి.దీనినే సౌర సంవత్సరము అని అంటారు.
శంకరాచార్యులు అమ్మవారిని ఇలా స్తుతిస్తున్నారు.అమ్మా!జగన్మాతా!నీవు బ్రహ్మరంథ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రములో అయ్యవారితో విహరిస్తున్నావు.నీ పాదద్వయముల మధ్యభాగము నుండి అమృతధారా వర్షములు ఉబికి వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నాయి.అమృతాతిశయ కాంతిగల చంద్రుని స్థానము,అనగా బ్రహ్మ రంధ్రమును,వీడి మరలా స్వస్థానమయిన మూలాధారమును చేరుతున్నాయి.అంటే ఒక రకంగా చెప్పాలంటే పాములాగ తనను తాను చుట్టుకున్నట్లుగా ఉంది.పృథ్వీతత్త్వమగు మూలాధారమందు తామరతూండ్ల మధ్యలోని సన్నని రంథ్రములో సూక్ష్మముగా కుండలినీ శక్తిగా నిద్రిస్తూ ఉంటావు.
భక్తుడు నీ పాదపద్మాలను చేరాలంటే చాలా దీర్ఘమయిన యాత్ర చేయాల్సిందే!సాధకుడు తన దేహంలో ఉన్న పృథ్వీతత్వంతో కూడిన మూలాథార చక్రంలో 56 కిరణాలను దాటాలి.ఆ పై జల తత్వాత్మికమయిన మణిపూరక చక్రంలో 52 మయూఖములను దాటాలి.ఆ తరువాత అగ్ని తత్వాత్మికమయిన అనాహత చక్రంలో 54 కాంతి రేఖలు దాటాలి.అటు పైన ఆకాశతత్వాత్మికమయిన విశుద్ధ చక్రము నందు 72 కాంతి కిరణాలు దాటాలి.ఆఖరున మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు 64 కిరణ పుంజాలు దాటాలి.అప్పుడే అమ్మవారి పాదాలు గోచరమవుతాయి.
శంకరాచార్యుల వారు స్వర్గంలోని కల్పవృక్షం అమ్మవారి కాలి గోటికి కూడా సమం కాదు అని ఎద్దేవా చేస్తున్నారు.ఎందుకంటే కల్పవృక్షం స్వర్గంలోని దేవతల కోరికలు మటుకే తీరుస్తుంది,మనకు కాదు.కానీ అమ్మవారి పాదపద్మాలను నమ్ముకుంటే మన అందరి కోర్కెలూ తీరుస్తుంది.
ఇంకో సారూప్యం కూడా చెబుతున్నారు శంకరాచార్యులవారు.అమ్మవారి గోర్లు చంద్రబింబాలలాగ వెలిగి పోతున్నాయట.శచీ దేవి,మిగిలిన దేవతలు ఆమె పాదాలకు నమస్కరించేటప్పుడు,వారి చేతులు చంద్రుని కాంతికి పద్మాలలాగ ముడుచుకుని పోతున్నాయట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment