Wednesday, 1 April 2026

స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ

స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ అను పవిత్రమయిన శుభనామము శ్రీలలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన ముప్పై ఆరవ నామము. స్తనభారంతో నడుము విరిగిపోతుందేమో అన్నట్లు ఉందట అమ్మవారికి.అలా కాకుండా చుట్టూ పట్టీలు వలె వళిత్రయము కానవస్తుంది అంట.వళిత్రయము అంటే అమ్మవారి పొట్టపైన ఉన్న మూడు మడతలు. ఆ తల్లి స్తన ద్వయం రవిసోమాత్మకమయిన కాలాన్ని సూచిస్తుంది.అట్టి కాలాన్ని భరిస్తుంది కాబట్టి కాలస్వరూపిణి అనే నామము సార్థకమయినది.వశిన్యాది వగ్దేవతలు ఆమెను ఇలా వర్ణించగా అమ్మ అరమోడ్పు కన్నులతో మందస్మిత అయిందట! ఆ ముడతలకు చాలా అర్థం ఉంది.ఆ మూడు ముడతలు సత్త్వ రజస్తమములనే గుణత్రయానికి ప్రతీక.స్థూల సూక్ష్మ కారణ దేహాలకు గురుతులు.మువురమ్మలు అయిన మహాలక్ష్మి,మహాకాళీ,మహా సరస్వతులుగా అనుకోవచ్చు.అంతే కాకుండా త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించవచ్చు.ముల్లోకాలు అయిన భూ,భువ,సువర్లోకములుగా సమన్వయించుకోవచ్చు. ఇప్పుడు ఇంక శంకరాచార్యుల వారు ఏమి చెబుతున్నారో గ్రహిస్తాము. అమ్మవారు సదా అయ్యవారి స్మరణలోనే ఉంటారు కదా!అందుకని సారెకు ప్రక్కలయందు చెమట పట్టి రవిక బిగుతు అవుతున్నదట!అందువల్ల చంకల దగ్గర ఒరుసుకుంటున్నదట.ఆ భారానికి సన్నని,లేలేత నడుము విరిగిపోకుండా మన్మథుడుచే ఏలకుల లతచేత కట్టబడిన మూడు కట్లవలె ఉన్నాయి అంట ఆ మూడు ముడతలు.ఆ మూడు ముడతలు అంత శోభాయమానంగా ఉన్నాయట! అన్నిటికంటే ఉత్తమమయిన విశ్లేషణ.శంకరాచర్యులవారు మన అందరికీ తల్లిగా,ప్రౌడ సౌందర్యంతో విరాజిల్లుతున్నది అని చెబుతున్నారు.బిడ్డల తల్లి అయిన ప్రౌడ స్త్రీకి ఉదరం పై ముడతలు అందం కన్నా పరిపూర్ణమయిన స్త్రీత్వానికి,మాతృత్వానికీ అర్థం చెబుతున్నట్లు ఉంది.సంకేతంగా కనిపిస్తున్నాయి.

No comments:

Post a Comment