Sunday, 12 April 2026

కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా

కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అను మంగళకరమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో పెట్టబడిన ముప్పై తొమ్మిదవ శుభనామము.పరమేశ్వరునికి మటుకే తెలిసిన సౌభాగ్యశ్రీలతోను మృదుత్వంతోను కూడిన ఊరువులు కలిగి ఉంది అమ్మవారు.భార్య యొక్క సర్వాంగములు భర్తకు ఒక్కడికే తెలుస్తాయి.కాబట్టి వశిన్యాది వాగ్దేవతలు కూడా ఆమె ఊరువులను ఇంక దేనితోను పోల్చలేదు. అమ్మవారి సర్వాంగములు వివిధ దేవతలయొక్క అంశలనుండి ప్రకటితమయ్యాయి కదా!అలా వరుణుని తేజస్సుతో ఊరువులు,పిక్కలు కలిగాయి.భూదేవి తేజముతో నితంబభాగము అనగా పిరుదులు కలిగాయి.అమ్మవారి ఊరువుల జంటలో ఎడమ తొడ సౌభాగ్యానికి సంకేతము.కుడి తొడ మార్దవ సంకేతము కలిగి ఉంది.ఊరు లలో ఊ అను అక్షరము,రు లో ఉకారము ఉన్నాయి.ఇందులో ఉ కారము దక్షిణ ఊరువు.ఊ కారము వామోరువు.వామోరువు పరాసూచితము.దక్షిణోరువు అపరాసూచితము.వామోరువు జగత్తులోని బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అను నాలుగు వర్ణములకు సూచన.దక్షిణోరువు భూమి,నీరు,వాయువు,నిప్పు,ఆకాశము అనే పంచభూతములు మరియు మనోబుద్ధ్యహంకారములకు సూచనగా నిలుస్తాయి. కామేశుడికే తెలిసిన ఊరూద్వయం అని వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఊరువులను దేనితో పోల్చలేదు.కానీ శంకరాచార్యులవారు మాత్రం కొంచెం ధైర్యం చేసారు.ఆయన ఇలా అన్నారు.అమ్మా!పరమేశ్వరీ!వేదవిహితమయిన ధర్మానుష్టానము కలిగినదానివి.నీ ఊరువులు రెండూ దిగ్గజముల తొండాల శోభనూ,బంగారు అరటి బోదెల అందాన్నీ ధిక్కరిస్తున్నాయి.అవి అత్యంత శోభాయమానంగా వెలిగిపోతున్నాయి.అలాగే నీ జానువులు,అనగా మోకాలి చిప్పలు రెండూ చక్కనయిన వట్రువులు(గోళాకారం)లాగా ఉన్నాయి.నీవు పతివ్రతా శిరోమణివి కదా!నిరంతరమూ నీ భర్తకు సేవలు చేసేతూ,మోకాళ్ళపై పాదాభివందనం చేస్తుంటావు కదా!అలా ఆ మోకాళ్ళు నేలకు రాసుకుని,రాసుకుని కఠినంగా మారాయి.ఎంతటి గట్టిదనం అంటే ఐరావత దిగ్గజము యొక్క కుంభస్థలాలను సైతం ధిక్కరిస్తున్నాయి.అవి జయకరంగా విరాజిల్లుతూ ప్రకాశిస్తున్నాయి.

No comments:

Post a Comment