Tuesday, 14 April 2026

ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికా

ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికా అను సుందర నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై ఒకటవ నామము. అమ్మవారి జంఘికలు,అనగా పిక్కలు మన్మధుని అంబులపొది లాగా కనిపిస్తున్నది.అదీ ఎర్రని రంగులో ఆరుద్ర పురుగులతే చుట్టూ చెక్కబడినట్లు ఉంది.ఆమె జంఘికలు మన్మథుని సుమబాణ తుణీరము లాగ గోచరిస్తున్నది.మన్మథుని బాణ తుణీరము ఎర్రని ఇంద్రగోపములచేత పొదగబడి ఉంటుంది. ఆరుద్ర పురుగులు వ్యవసాయము మొదలు పెట్టుటకు ఆరుద్ర కార్తె అనుకూలమయినది.అవి ఎర్రగా గురివింద గింజలంత ఉంటాయి.ఆరుద్ర పురుగు మఖ్ మల్ వస్త్రము లాగ అందమయిన,సున్నితమయిన,ఎర్రని పట్టు వస్త్రము కప్పుకున్నట్లు ఉంటుంది.వర్షంలో ఇవి చావకుండా ఇంద్రుడు కాపాడుతుంటాడు.కాబట్టి వీటిని ఇంద్రగోపములు అని అంటారు.అమ్మవారి జంఘికములు ఇంద్రగోపములతో పొదగబడిన మన్మథ బాణతూణీరములాగ ఉంది.అందులో మల్లెలు,చంపకములు(సంపంగెలు),పున్నాగములు మొదలైన సుగంథ భరిత పుష్పములతో చేయబడిన బాణాలు ఉంటాయి.మన్మథుని విల్లు ఇక్షుకము(చెఱకుగడ)తోనూ,వింటి నారి బిసతంతువులు(తామరతూండ్లలోని సన్నని దారములు)తో చేయబడి ఉంటుంది.ఇంతేనా!ఆ విల్లు పైన సమ్మోహన మంత్రమూ,వశీకరణ మంత్ర బీజాక్షరములు లిఖించబడి ఉంటాయి. శంకరాచార్యులవారు ఇంకొంచెం ఎక్కువగా వర్ణిస్తున్నారు అమ్మవారి జంఘికములను.హే గిరిసుతా!ఈశ్వరుని గెలిచేదాని కోసరము మన్మథుడు నీ పిక్కలను పదేసి బాణాలుండే అమ్ముల పొదిలాగ తయారు చేసుకున్నాడు.నిజానికి ఆయన దగ్గర ఉండేవి ఐదు బాణాలే.అవి చాలవని నీ గోటికొనలనెడు బాణాగ్రములు కనుపించుచున్నవి అని అంటున్నాడు.ఆ బాణాగ్రములు అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న దేవతల కిరీటములచే పదును పెట్టబడి ఉన్నాయి.అంటే ప్రొద్దున లేచి ముక్కోటి దేవతలు ఆమెకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారన్నమాట.మరి ఆ కిరీటాలు అమ్మవారి కాలి గోళ్ళకు రాసుకుంటుంటే గోర్లు పదునెక్కకుండా ఉంటాయా? ఇదే కాకుండా ఇంకో విశ్లేషణ.ఇంద్రగోపములు అంటే మంత్రము లోని బీజాక్షరములు అని రహస్యార్థము.తూణము లేక తూణీరము అంటే మంత్ర సముదాయము.తూణము నందు ఉండే బాణములచేత మంత్రములు సూచితమవుతున్నాయి.ఆ జగన్మాత యొక్క జంఘికలు మహావర్ణ సంపుటికలు.

No comments:

Post a Comment