Saturday, 18 April 2026
కూర్మపృష్ఠజయిష్ణు ప్రపదాన్వితా
కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా అను మథురమయిన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై మూడవ నామము.తాబేలు వీపుకంటే కూడా సుందరమయిన మీగాళ్ళుతో అమ్మ అలరారుతున్నది.మీగాళ్ళు అంటే అరిపాదము పైభాగము.అమ్మవారి పాదములు మోక్షప్రదములు.నాలుగు వేదాలకు సంబంథమయిన అహం బ్రహ్మాస్మి,తత్త్వమసి,ప్రజ్ఞానం బ్రహ్మ,అయమాత్మా బ్రహ్మ అనే నాలుగు పరమ పవిత్రమయిన వాక్యములు అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవి.శ్రీమహా విష్ణువు ఆది కూర్మము రూపములో తన పృష్ఠ భాగముతో మంధర గిరిని క్షీరసాగరంలో కృంగకుండా ఆపగలిగాడు.అటువంటి బహు సుందరమయిన ఆ ఆదికూర్మము యొక్క పృష్ఠ భాగము కంటే కూడా జగన్మాత పాదాగ్రములు సుందరమై,అత్యంత మృదుత్వంతో వెలిగిపోతున్నాయి.
అమ్మవారిని కీర్తించడంలో శంకరాచార్యులు రెండాకులు ఎక్కువే చదివారు అని ఎప్పుడూ అనుకుంటాము కదా!ఇక్కడ కూడా అది నిజమయింది.ఆయన ఇలా అంటున్నాడు.ఓ అఖిలాండేశ్వరీ!నీ పాదములు యశస్సును కలిగించేవి.విపత్తులను హరిస్తాయి.పురారి అయిన శివుడు వివాహ సమయంలో మృదువైన నీ పాదములను చేతబట్టి సన్నెకల్లును త్రొక్కించాడు.ఆరాయి పైన పెట్టినప్పుడు పాదం కమిలి పోతుందేమోనని బహు వ్యాకులపడినాడు.అలాంటి సుతిమెత్తని పాదాగ్రములను కఠినమయిన తాబేలు పృష్ఠ భాగముతో పోల్చడం సబబేనా అని వాపోతున్నాడు.
ఓ లలితా పరమేశ్వరీ!నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగిస్తావు.సకల ఆపదలు తొలగిస్తావు.నీ పాదాగ్రములు మంచికి పుట్టినిల్లు లాంటివి.నీ పాదాగ్రములు చెడు అనేది దరిచేరలేని శుభకరమయిన వాకిళ్ళు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment