Thursday, 11 June 2026

పంచ బ్రహ్మాసన స్థితా

పంచ బ్రహ్మాసన స్థితా అను పవిత్రమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో ఏభై ఎనిమిదవ నామముగా చెప్పబడింది. బ్రహ్మ,విష్ణువు,రుద్ర,ఈశాన,సదాశివులు పంచ బ్రహ్మలు అని అంటరు.వీరిని ఐదుగురినీ తన ఆసనంగా స్వీకరించింది ఆ తల్లి.వీరిలో మొదటి నలుగురు మంచపు కోళ్ళు,సదాశివుడు ఆ మంచానికి పానుపు.అమ్మవారు చింతామణులచే నిర్మింప బడిన గృహములో కూర్చునే ఆసనానికి కోళ్ళుగా...।ఆగ్నేయం వైపున చతుర్ముఖ బ్రహ్మ,నైరుతి దిక్కుగా ఉండే కోడుగా శ్రీ మహా విష్ణువు,వాయువ్యంలో ఉండే కోడుగా రుద్రుడు,ఈశాన్యంలో ఉండే కోడుగా ఈశ్వరుడు ఉంటారు.ఈ నాలుగు కోళ్ళను కలుపుతూ ఒక పర్యంకం.దాని పైన అచ్ఛాదనగా సదాశివుడు ఉంటాడు.అందుకే ఆ తల్లిని పంచ బ్రహ్మాసన స్థితా అను నామకరణం జరిగింది.ఆ పర్యంకం పైన పదహారు వత్సరాల నవ మన్మథుడిలాగా ప్రకాశిస్తున్న మహా కామేశ్వరుడు తన ఎడమ తొడపైన అమ్మవారిని కూర్చుని పెట్టుకుని ఉంటాడు. అమ్మవారి మంచం కోళ్ళుగా ఉండే బ్రహ్మ సృష్టి చేస్తాడు.శ్రీ మహా విష్ణువు స్థితి కారకుడు.రుద్రుడు లయ కారకుడు.తిరోధానము,అనుగ్రహము అను ఉన్నాయి.తిరోధానము అంటే కనబడకుండా చెయ్యడం.అంటే మాయే కదా!ఈ మాయే ఈశ్వరుడు. శివుడు తెల్లని కాంతి అనే మిషతో ఆమెకు దుప్పటి లాగ అయ్యాడు.అమ్మవారి శరీరం రాగరంజితము కదా!ఆ తెల్లని దుప్పటి కూడా ఎర్రబారి,శృంగార రసము ఒలకబోస్తుంది అట! ఇదే కాకుండా తూర్పు,దక్షిణము,పడమర,ఉత్తరము,ఊర్ధ్వ దిశలు కూడా పంచ బ్రహ్మలు అని అంటారు.అలాగే పంచ భూతాలు అయిన పృథ్వి,జలము,ఆకాశము,అగ్ని,వాయువులను కూడా పంచ బ్రహ్మలు అని అంటారు.హల్లులలో క-చ-ట-త-ప లను కూడా పంచ బ్రహ్మలని అంటారు. ఆఖరుగా సద్యోజాతము,వామదేవము,అఘోరము,తత్పురుషము,ఈశానము అనే ఐదుగురు శివాకార మంచము అని అంటారు. శ్రీచక్రము నందు ఐదు శక్తి చక్రములు,నాలుగు శివ చక్రములు ఉన్నాయి.ఆ ఐదు శక్తి చక్రములనే పంచ బ్రహ్మలు అని అంటారు.వాటన్నిటి మధ్యలో ఆసీనమయి ఉండే బిందువే పరమేశ్వరి.

No comments:

Post a Comment