Saturday, 25 April 2026

శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా

శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా అను పవిత్ర నామము శ్రీ లలితా సహస్ర నామావళిలో అమ్మవారికి పెట్టబడిన నలభై ఆరవ నామము. అమ్మవారు కాలి అందెలు ధరించి ఉన్నారు.అవి ఎలా ఉన్నాయంటే మథురమయిన చిరు సవ్వడులు చేస్తున్నాయి.ఆ కాలి అందెలు మణిఖచితమయి ఉన్నాయి.అవి ధరించిన అమ్మవారు శుభకరంగా,శోభాయమానంగా వెలిగి పోతున్నారు.ఆమె పాదాలను అలంకరించిన మణిఖచిత అందెలు శ్రవణానందంగా చిరు సవ్వడులు చేస్తున్నాయి.ఆ సవ్వడులు ప్రణవ నాదం చేస్తున్నట్లున్నాయి.పంచదశీ మంత్రము నర్మగర్భితంగా ఆలపిస్తున్నట్లుంది.శుద్ధవిద్యాంకుర స్వరూపులైన బ్రాహ్మణులు వల్లెవేసే వేదాధ్యయనం లాగ అనిపిస్తుంది. శంకరాచార్యులవారి చతురత ఇక్కడ బయట పెట్టారు.శివుడికి పార్వతి చేత పాదతాడనం చేయించుకోవాలి అని కోరిక కలిగింది అంట.అందుకని గౌరి ఊసు ఎత్తాడట ఉమ ముందర.ఇంకేముంది?పరాయి స్త్రీ మాట పతి నోట వస్తే ఇంక ప్రళయమే కదా!ఆమె శివుడి పైకి కాలు విసిరింది అంట!భవుడికి జరిగిన పరాభవము చూసి మన్మథుడు విరగబడి నవ్వాడట!నవ్వడా?ఆ శివుడే కదా ఈ మన్మథుడిని భస్మ చేసింది!మన్మథుడి మనసు కొంచెం తేలికపడి,ప్రశాంతంగా,ఒకింత పరిహాసంగా కిలకిలమని నవ్వినట్లుందట ఆ అందెల సవ్వడి!

1 comment: