Friday, 24 April 2026
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా అను దివ్యనామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన నలభై అయిదవ శుభనామము.
ప్రభాజాలములు అంటే కాంతి కిరణాలు.ఆ తల్లి పాదములు పద్మముల కాంతిని సైతం తిరస్కరించేటంత కాంతులతో విరాజిల్లుతున్నాయి.మాములుగా దేవుళ్ళు,దేవతల పాదపద్మములు అని చెప్పుకుంటాము కదా!కానీ ఇక్కడ అమ్మవారి పాదద్వయము అంతకు మించి అనినట్లు ఉంది.ఆమె పాదములు పద్మముల కంటే కూడా దివ్యకాంతులతోను,మృదువుగా,కోమలంగా విరాజిల్లుతున్నాయి.
వశిన్యాది వాగ్దేవతలు ఇలా అనే దానికి గట్టి కారణమే ఉంది.లేకపోతే అంత ఆషామాషీగా ఎలా అనేస్తారు?వారి ఉద్దేశ్యంలో పద్మాలు,వాటి కాంతులు ఎక్కువ సేపు నిలవవు.నీటిలో ఉన్నా సరే,నీటి బయట ఉన్నా సరే.కానీ అమ్మవారి పాదపద్మముల కాంతి అనంతరం,నిరంతరం వెలుగులు చిమ్ముతూనే ఉంటాయి.ఎందుకంటే 360 కిరణములు అమ్మవారి పదద్వయ ప్రభాజాలములే!ఈ కిరణాలే చరాచర జగత్తును ప్రకాశింప చేస్తున్నాయి.లేక పోతే అంతా అంధకార బంధురమే!ఈ పాదాలను మనము పూజిస్తున్నాము అంటే మనము చాలా చాలా అదృష్టవంతులము.ఎందుకంటారా?ఆ పాదములను నిత్యమూ బ్రహ్మ,విష్ణువు,మహేశ్వరులు పూజిస్తారు.అంతేనా?చతుర్వేదముల చేత కూడా పూజింపబడతాయి.
అమ్మవారి కుడి పాదము శుక్లవర్ణము.అమ్మవారి ఎడమ పాదము రక్త వర్ణము.ఈ రెండూ కలిసి అజ్ఞానము,అవిద్యా రూప సంసార బంధమును తొలగింపచేస్తాయి.బ్రహ్మ తేజముతో అమ్మవారి పాదద్వయము ఏర్పడింది.
Subscribe to:
Post Comments (Atom)
🙏
ReplyDelete