Saturday, 16 May 2026

సుమేరు శృంగ మధ్యస్థా

సుమేరు శృంగ మధ్యస్థా అను అసమాన నామము అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామావళిలో చెప్పబడిన ఏభై ఐదవ నామము. ఆ తల్లి శుభకరమయిన మేరు పర్వతము యొక్క శిఖరము మధ్య ప్రదేశంలో ఉంది.శ్రీచక్రంలోని బిందువే మేరుశృంగం.ఇక్కడ ఉండే త్రిభుజంలో తూర్పు కోణం వద్ద ఇచ్ఛాశక్తి,నైఋతీ కోణం వద్ద క్రియా శక్తి మరియు వాయువ్య కోణం వద్ద జ్ఞానశక్తి ఉంటాయి.ఈ మూడింటి బిందు స్థానం అయిన మేరుశృంగంలో అమ్మవారు అయ్యవారి వామాంకం పై ఆశీనురాలయి ఉంటుంది.కాబట్టి ఈనామ మంత్రాన్ని సుమేరు మధ్య శృంగస్థా అని కూడా పలుకుతారు.సుందరమయిన మేరు శిఖరాలు మూడు ఉన్నాయి.వాటి మధ్యలో ఇంకో శిఖరం ఉంది.మధ్య శిఖరంలో అమ్మవారు అయ్యవారితో కూడి ఉంటారు.మిగిలిన మూడు శిఖరాలు క్రమముగా బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులలోకాలకు ఆధారములు అయ్యాయి. మనలో ఉండే వెన్నెముకను మేరుదండమని అంటారు.ఆ వెన్నెముక మధ్యనుండి సుషుమ్నా మర్గము సహస్రార చక్రము వరకూ ఉంటుంది.మేరు పదాన్ని విడదీస్తే మ్+అ+ఇ+ర్+ఉ.ఈ అయిదు అక్షరములు అయిదు శృంగములు.దీనిలో మధ్యలో ఉన్నది ఇ.కాబట్టి ఆ తల్లి సుమేరు శృంగ మధ్యస్థా అయింది.

No comments:

Post a Comment